పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
- సామాజిక సంస్కరణల దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు
- దొమ్మర, పిచ్చకుంట్ల తదితర కులాల పేర్ల మార్పు
- మరికొన్ని కులాలకు గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడించిన ప్రభుత్వం
తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) చిరకాల వాంఛను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. బీసీ కమిషన్ సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర కేబినెట్, జాబితాలోని కొన్ని కులాల పేర్లను మారుస్తూ మరికొన్నింటికి గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడిస్తూ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా సమాజంలో పిలిచేందుకు అసభ్యకరంగా లేదా కించపరిచే విధంగా ఉన్న పదాలను రికార్డుల నుంచి తొలగించి, ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా కొత్త పేర్లను ఖరారు చేసింది. ఈ మార్పులు తక్షణమే రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారిక రికార్డుల్లో అమల్లోకి రానున్నాయి.
బీసీ గ్రూప్-ఏ విభాగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా వరుస సంఖ్య 7లో ఉన్న ‘దొమ్మర’ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘గడ వంశీయ’ అనే పేరును ఖరారు చేసింది. అలాగే వరుస సంఖ్య 18లో ఉన్న ‘పిచ్చకుంట్ల’ అనే పదాన్ని మారుస్తూ, ఇకపై వారిని ‘వంశ రాజ్’గా వ్యవహరించాలని నిర్ణయించింది. వీటితో పాటు బుడబుక్కల కులానికి ‘శివ క్షత్రియ’ అనే పదాన్ని, వీరభద్రియ కులానికి వారి కోరిక మేరకు ‘వీరముష్టి, నెట్టి కోటల’ అనే పదాలను పర్యాయపదాలుగా జోడించింది. వన్నార్ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘ధోబీ’ అనే పదాన్ని చేర్చడం ద్వారా రజక, చాకలి వర్గాలకు మరింత స్పష్టమైన గుర్తింపును కల్పించింది.
అదేవిధంగా బీసీ గ్రూప్-డి విభాగంలో కూడా ప్రభుత్వం సామాజిక స్పృహతో పలు మార్పులు చేసింది. ముఖ్యంగా ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న ‘శూద్ర కులం’ అనే పదాన్ని రికార్డుల నుంచి పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో ‘తమ్మలి (బ్రాహ్మణేతర)’గా పేరు మార్చింది. దీనివల్ల ఆ వర్గానికి ఒక స్పష్టమైన సామాజిక గుర్తింపు లభిస్తుంది. అలాగే వరుస సంఖ్య 5లో ఉన్న 'మేర', 'చిప్పోలు' కులాలకు ‘మేరు’ అనే పదాన్ని అదనంగా చేర్చింది. ఈ మార్పుల వల్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాల్లో గౌరవప్రదమైన పేర్లను పొందే అవకాశం ఉంటుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుందని బీసీ కమిషన్ అభిప్రాయపడింది.